Books written by Sri Somayaji Saripalle
సరిపల్లె వేంకట సుబ్రహ్మణ్య సోమయాజి గారి గ్రంధములు
- చిత్సుఖీయము- 2 భాగములు (published 1997, 1999) - సుమారు 400 పుటలు
- శ్రీమద్దేవీ భాగవతము (2002) - సుమారు 750 పుటలు - Paperback- Demmi size
- శ్రీహరి వంశము (2012) - సుమారు 700 పుటలు - Paperback- Demmi size
- మహాభారత ఉపాఖ్యానములు - (2015) - సుమారు 1500 పుటలు- Hardcover - Crown size
- శ్రీమద్రామాయణము - 2 భాగములు- (2013) - సుమారు 800 పుటలు - Hardcover - Crown sz
- శ్రీమద్భాగవతము - 2 భాగములు- (2011 ) - సుమారు 1600 పుటలు- Hardcover - Crown size
- ఉపనిషద్భారతి - (2015) - Paperback- Demmi size
- శ్రీవేదభారతీచరితామృతము- Kindle ebook (2018) - Hardbound (2020)
- ఆధ్యాత్మ గీతా రత్నావళి - 2013 - Paperback - Demmi sz
- ఆధ్యాత్మ గీతా తరంగిణి - 2016
- ఋభుగీత - 2016
- ఆధ్యాత్మ గీతా మణిమాల - 2017
- ఆధ్యాత్మ గీతా శ్రీలహరి - 2018
- శ్రీకృష్ణ గీతాత్రయము - 2017
16. యోగతత్వగీతోపనిషత్తులు ... ముద్రణలో వుంది. 2023 ప్రకటన.
17. సూతసంహిత ... సుమారుగా సం||2024లో
18. ధర్మప్రకాశిక ... సుమారుగా సం||2025లో
బ్రహ్మశ్రీ సరిపల్లె వెంకటసుబ్రహ్మణ్య సోమయాజి గారి గ్రంధాల ప్రత్యేకత ఏమిటి?
శ్రీ సోమయాజిగారు 40 ఏళ్ళకు పైగా వేదం, ఉపనిషత్, ధర్మశాస్త్రములు, స్మృతులు, పురాణములు, వాటికి వ్యాఖ్యలు, తెలుగు - హిందీ - సంస్కృత భాషలలో వున్న గ్రంధాలను పరిశోధించారు. మంత్ర తంత్ర శాస్త్రాలనూ అధ్యయనం చేశారు. వేదాధ్యయనము, అగ్నిహోత్రాది కర్మలను నిష్ఠతో ఆచరించారు. ఆసేతుహిమాచలమూ వున్నా పుణ్య తీర్థములను దర్శించి సేవించారు. పురాణ - కావ్య లక్షణాలు ఉట్టిపడే విధంగా క్రింది గ్రంధాలను రచించారు.
1. శ్రీహరివంశము: శ్రీకృష్ణుని చరిత్ర మనలో ఎక్కువమందికి సినిమా ద్వారా మాత్రమే తెలుసు. తెలుగులో శ్రీకృష్ణుని కీర్తించే సినిమాలు ఎక్కువగా భాగవతం ఆధారంతో నిర్మించినవి. అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పేవే. కాని ఆయన మనుష్యుడుగా జన్మించేడు. మనుష్యులు పడే కష్టాలే పడ్డాడు. మనుష్యుల ధర్మాలే పాటించి కష్టమైన పరిస్థితులని దాటాడు. మహాభారత యుద్ధానికి ముందు ఎన్నో యుద్ధాలను చేసేడు. తల్లిదండ్రుల ప్రేమను పొందటం, ప్రేమించిన అమ్మాయిని (రుక్మిణిని) పెళ్ళి చేసుకోవటం, ప్రజలను రక్షించుకోవటం, నగరాన్ని (ద్వారక) నిర్మించటం, దొంగతనం అపనిందను పోగొట్టుకోవటం...ఈ కోణంలో శ్రీహరివంశం మనకు కనిపిస్తుంది. ఇటువంటి సమస్యలే కలవారు ఈ వృత్తాంతాలను చదివితే ఆ సమస్యలనుంచి బయటపడగలరు. శ్రీకృష్ణుడు మనుష్యుడుగా, కొడుకుగా, తమ్ముడిగా, భర్తగా, భగవంతుడుగా, తండ్రిగా, తాతగా, స్వామిగా, వీరుడిగా, నాట్యాచార్యుడుగా, సంగీతశాస్త్ర పండితుడుగా అనేక కోణాలలో ఈ గ్రంధంలో కనిపిస్తాడు.
ఇది వ్యాసునిచే రచించబడినది. దీనిని చదివినవారు సకల సమస్యలనుంచి విముక్తులయ్యి మనశ్శాంతి పొందుతారు. ఆధ్యాత్మిక ఉన్నతి పొందుతారు. ప్రతిరోజూ ఒక శ్లోకము, ఒక అర్ధశ్లోకము లేదా ఒక పాదము చదివినా సరే హరివంశ పురాణము వారి పాపాలను పటాపంచాలు చేస్తుంది. సంతానం కోసం, నపుంసకత్వ- వంధ్యాత్వ- గర్భ దోషాలు పోవటం కోసం విశేషంగా ఈగ్రంధం చదవాలి లేదా ఎవరిచేతైనా చెప్పించుకోవాలి. సుందరమైన ఎఱ్ఱనగారి పద్యాలు మనోల్లాసం కలుగజేస్తూ అక్కడక్కడా ఇవ్వబడినాయి. పారాయణా విధానం కూడా ఇవ్వబడినది.
2. రామాయణము: ప్రాంతం - భాష - కాలం తేడాలులేక ప్రపంచమంతా, విశేషంచి భారతదేశమంతా రామభక్తి రసంలో ఓలలాడింది. తులసీదాసు రామచరిత మానస, హనుమద్రామాయణము, బుశుండి రామాయణము ఇలా అనేక రామాయణాలు వేరు వేరు ప్రాంతాలలో ఆదరణలో వున్నా వాల్మీకి రామాయణము అన్నిటికీ ఆధారమైనది, ప్రామాణికమైనది.
ఆకలి తెలియదు. దాహం వెయ్యదు. లోకమంతా కొత్తగా అందంగా కనిపిస్తుంది. అంతా ప్రేమమయం - జగమంతా రామమయం అనిపిస్తుంది. సోమయాజిగారి వాల్మీకి రామాయణం చదివితే కలిగే అనుభవమే ఇది. సోమయాజిగారి గ్రంధంలో నవరసాలు ఒలికాయి. అంతేకాకుండా ఇందులో రామకథ ‘ధర్మో రక్షతి రక్షితః’ , ‘సత్యమేవజయతే ‘అనే నిత్య సత్యాలను అడుగడుగునా గుర్తుచేస్తూ సాగుతుంది. ధర్మాన్ని (పుత్ర ధర్మం, పతి ధర్మం, పత్నీధర్మం, రాజ ధర్మం, స్నేహ ధర్మం, సేవాధర్మం...ఇలా) రక్షిస్తే ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది. సత్యమే చివరికి జయిస్తుంది. (సత్యమంటే నిజం మాట్లాడటం ఒక్కటే కాదు. అనుకున్న నియమాలను వ్రతాలను పాటించటం, తలపెట్టిన పనులను పూర్తిచేయటం, లక్ష్యాలను సాధించటం, ఇవికాక ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, చెప్పినదే చేయటం- ఉదాహరణకు పెళ్ళిలో వధూవరుల ప్రమాణాలు, పట్టాభిషేక సమయంలో రాజ్యానికి చేసే ప్రమాణాలు...).
పారాయణా విధానం ఇవ్వబడినది. శ్రీరామకర్ణామృతము నుంచి కొన్ని అందమైన శ్లోకాలు ప్రతి అధ్యాయము చివర ఇవ్వబడినాయి. గాయత్రీ రామాయణ పద్ధతిలో అధ్యాయములు మొదలు పెట్టబడినవి. రామాయణ కాలనిర్ణయ బోధిని చేర్చబడినది. నీలకంఠ పండితుని మంత్రరామాయణమును తెనిగించి మొదటిసారిగా తెలుగువారికి అందించారు.
3. భాగవతము: నారాయణుడు తన వివిధ అవతారాలద్వారా భగవంతుడి ఆరులక్షణాలను ప్రదర్శించిన తీరును కీర్తిస్తూ వ్యాసుని భాగవతం శుకునిచే చెప్పబడుతూ సాగుతుంది. నారాయణుడు దశావతారాలే కాక కపిలభగవానుడు, ఋషభదేవుడు, దత్తాత్రేయుడు, ఇంకా అనేక అవతారాలు కేవలం లోకకల్యాణంకోసం ధరించాడు. ఈ అవతారాలన్నిటా నారాయణుడు చేసిన లీలలలో (లీల అంటే - నిష్కాముడైనప్పటికీ నారాయణుడు మానవుడిగా/ చేపగా/బ్రాహ్మణుడిగా/క్షత్రియుడిగా వివిధ కర్మలు అవసరమయ్యి చేసినట్టు చేయటం) భగవద్ లక్షణాలు ఎలా ప్రకాశించాయో కీర్తిస్తూ ఆయనను భగవానుడు అని ప్రతిపాదిస్తాయి భాగవతవ్యాఖ్యలు. పండిత వ్యాఖ్యలు లేకుండా భగవంతుడి లీలలను అర్థం చేసికొనటం కష్టము. వ్యాకరణ పండితులు, వేద ఉపనిషద్ పండితులు, తత్త్వవేత్తలు చేసిన అనేక వ్యాఖ్యలు ఉత్తరహిందూస్థానములో ప్రచారంలో వున్నాయి. అంతేగాకుండా వాటన్నిటి సమగ్ర సమీక్ష అయిన అఖండానందసరస్వతీ సమీక్ష అక్కడ ఎక్కువ ఆదరణ పొందింది. ఇది హిందీభాషలో వుంది. సోమయాజిగారు భాగవతంలో తన వ్యాఖ్యానమేగాక వివిధ పండిత వ్యాఖ్యలు - అఖండానందసరస్వతీ సమీక్షలతో గ్రంథాన్ని పండిత-పామర రంజకంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగునాట ప్రచారంలో వున్నటువంటి, సుందరమైన పోతన పద్యాలు సందర్భోచితముగా ఇచ్చారు. ఈ గ్రంధం చదివినవారికి భగవంతుడిపట్ల స్థిరమైన భక్తి కలుగుతుంది. మానసిక వికారాలు దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇదే ఏ భాగవతగ్రంథానికైనా పరమావధి. ఇటువంటి భాగవతగ్రంధాన్ని రచించిన సోమయాజిగారు, చదివే మనము భగవత్ కృపకు పాత్రులము - ధన్యులము.
4. శ్రీమద్దేవీభాగవతము: వ్యాసభగవానుడు రచించిన ఈ గ్రంథం శ్రీదేవిని భగవతిగా ప్రతిపాదించి నిరూపించింది. ఈ గ్రంథం చదివినవారికి సకల శుభాలూ కలుగుతాయి. నూతన గృహయోగానికి, గ్రహబాధలు పోవటానికి, శిశు సంరక్షణకు, వివాహముకు, భయనివారణకు, అనుకున్న కార్యాలు నెరవేరటానికి ఇలా ఎన్నో సమస్యలనుంచి విముక్తులవుతారు. దేవీ ఉపాసకులు, భక్తులు అయిన సోమయాజిగారు దేవీలీలలను కనులకి కట్టినట్టు సాక్షాత్కరింపచేశారు. ఈ గ్రంధం చదివినవారికి భగవతి పట్ల స్థిరమైన భక్తి కలుగుతుంది. మానసిక వికారాలు దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇటువంటి భాగవతగ్రంధాన్ని రచించిన సోమయాజిగారు, చదివే మనము దేవీకృపకు పాత్రులము - ధన్యులము.
5. మహాభారత ధర్మోపాఖ్యానములు: మహాభారతములో పాండవుల ధర్మసమ్మతమైన నిర్ణయాలకు ఆధారమైన ధర్మపరిశీలన ఉపాఖ్యానముల ద్వారా సవిస్తరముగా వివరించబడినది. అటువంటి ఉపాఖ్యానములన్నీ సోమయాజిగారు ఒకచోట చేర్చి ఈ గ్రంధాన్ని కూర్చారు. ఈ గ్రంధం చదివినవారికి ధర్మశాస్త్రములో గల అనేక సందేహాలు నివృత్తి అవుతాయి. సుఖజీవనానికి ఆధారమైన ధర్మపరిశీలనా నిపుణతకు ఈ గ్రంధం తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చదివితీరాలి.
6. ఆధ్యాత్మిక గీతా రత్నావళి: గీత అంటే చెప్పబడినది అని అర్థం. ఆధ్యాత్మగీతలు ఆత్మతత్త్వం గురించి ఒకరు మరొకరికి చెప్పినవి. ఆత్మతత్త్వము అనేక సందర్భాలలో అనేక కోణాలలో పూర్వ ఋషులు, దేవతలచే చెప్పబడినది. వాటిలో భగవానుడు అర్జునునికి చెప్పిన ఆత్మతత్త్వము భగవద్గీత. ఇది గీతలన్నిటిలోనూ సర్వోత్కృష్టమైనది. అయితే ఇది అర్థం అయినట్టుగా అనిపించినా అర్థంకావటం సులభము కాదు. దీనిని అర్థం చేసుకొనటానికి పురాణాలలో, ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన వివిధ ఆత్మతత్త్వగీతలు ఉపకరిస్తాయనే ఉద్దేశ్యముతో సోమయాజిగారు అనేక ఆత్మతత్త్వగీతలను సంభాషణలను సంగ్రహించి పండిత పామరులిరువురికి అర్థమయ్యే సులభమైన భాషలో ఈ గ్రంధాన్ని తీర్చిదిద్దారు. ఈ గ్రంథము నందు గీతలు అన్నీ మహాభారతము గ్రంథములోనివి.
7. చిత్సుఖీయము: మనసుకు సుఖము కలిగించే ఆత్మతత్త్వ వ్యాసములు చిత్సుఖీయము గ్రంధంగా రూపొందించబడినది. సోమయాజి గారు సరస్వతి, భూదేవి, ఆదిత్యులు, రుద్రులు, మంత్రపుష్పము, పురంజయుడు...ఇలా దేవ దేవీ తత్త్వములు ఉపాఖ్యానములద్వారా ఆత్మతత్త్వమును సులభమైన భాషలో రచించారు. ఇంతేగాక నాదోపాసన, పెళ్ళితంతు, వేదాలలో ఏమున్నది, అధర్ముని వంశకీర్తనము వంటి ఆసక్తికరమైన వ్యాసములు వున్నాయి. ఆత్మతత్త్వముపై చాలా సమగ్రమైన విస్తారమైన వివరణ కలిగిన చిత్సుఖీయము అనే ఈ గ్రంధము రెండు భాగాలలో ప్రచురితమైనది.
చిత్సుఖీయము మొదటి భాగము
1
య ఏష సుప్తేషు జాగర్తి 2 వేదములలో ఏమున్నది 3 అగ్నిదేవుడు 4 మంత్రయోగము 5
బీజాక్షర రహస్యం 6 శ్రీదేవి వాగీశ్వరీ దేవి 7 అవధూత చింతనం 8 శ్రీ విద్యా
వైభవము 9 శంఖు లిఖితులు 10 బ్రహ్మ చెప్పిన ధర్మ సర్వస్వం 11మహాకర్త -
మహాభోక్త - మహాత్యాగి 12 పితృదేవతలు శ్రాద్ధ కర్మ 13 జపయజ్ఞము 14 మనువు
చెప్పిన మానవధర్మము 15 కర్మ యోగి16 మంత్ర శాస్త్రము లో నామ మహిమ 17 శ్రీ
అరవింద వాణి 18 శ్రీ చండీ దర్శనము 19 యమ గీత 20 రాధా మాధవీయం 21
పురాణేతిహాసములలో ఉపాఖ్యానములు 22 అధ్యాత్మ రామాయణము 23 భూదేవి 24 మంత్ర
పుష్పము
చిత్సుఖీయము రెండవ భాగము
1
తమసోమా జ్యోతిర్గమయ 2 జగచ్చక్షువు 3 అన్నం చ బ్రహ్మ 4 షోడశ సంస్కారములు 5
పెండ్లి తంతు 6 దేవపూజ 7 తంత్ర విజ్ఞానము 8 యజ్ఞము 9 తపస్సు 10
మృత్యుంజయము 11 పుత్రులు - శిష్యులు 12 మోక్ష రామాయణము 13 అధర్ముని
వంశకీర్తన 14 ఉత్తమ జన్మ 15 భక్త శబరి 16 శత రుద్రీయము 17 పురంజనుడు 18
మహాభారత తత్త్వము 19 శ్రీ లలితా సహస్రనామ వైశిష్ట్యం 20 శివ కేశవులు 21
పురాణ ప్రశంస 22 హృది - అయం
8. శ్రీ వేదభారతీ చరితామృతము: ఇది శ్రీయాజిగారి పరిశోధనా గ్రంథము. అనంతమైన వేదమునకు అనంతమైన చరిత్ర ఉంది. "నిరంతర జ్ఞానాన్వేషకు లైన వారికి వేద కథామృతము ఎంత గ్రోలినా తనివి తీరదు" అంటే అది అతిశయోక్తి కాదు. వేద ఉత్పత్తి, అనంత కాలంగా అనేక కోణాలలో శాఖోపశాఖలై వాజ్ఞ్మయముగా విస్తరించటం, మానవ పరిజ్ఞానాన్ని మించి ఆలోచింప చేసే విధమును వివరించటం వంటివన్నీ వేదభారతీ చరితామృతము చక్కగా చేసింది. వేదము గురించి ఎప్పుడు చదివినా ఏదో ఒకక్రొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. ఈ గ్రంథములో ఇంకా ఎన్నో విశేషాలు వివరించబడినవి. విస్తారంగా నాలుగు వేదాల గురించి, వేదఋషులు - ఋషికల గురించి, వేదసూక్తాల అవగాహన, శిల్ప- గాంధర్వ- ధనుర్వేద- ఆయుర్వేదములు, మంత్ర- తంత్ర, బ్రాహ్మణ- ఆరణ్యక - ప్రాతిశాఖ్య - ఉపనిషత్తులు, వివిధ విద్యలకు వేదం ఎలా ఆధారమయ్యిందో ఈ గ్రంథము ఆమూలాగ్రము ఎంతో సమగ్రంగా సుందరముగా వివరించింది. తమ వేద సంపదను గురించి ఉప్పొంగే ప్రతి భారతీయ తేజస్వి ఈ గ్రంథమును సగర్వంగా తన పుస్తకాలయములో ఉంచుకోవచ్చు. ఇక చదివి ఆ వివరాలు మిగిలిన వారితో పంచుకోగలిగితే ఇంకెంత బావుంటుందో!
9 -14. అధ్యాత్మ గీతా గ్రంధములు: జ్ఞాన విజ్ఞాన ప్రదములు నిత్యపారాయణా యోగ్యములు ఐన సుమారు 60 అధ్యాత్మతత్త్వ గీతలు శ్లోక తాత్పర్యాలతో 6 పుస్తకములుగా ప్రచురించబడుచున్నవి. తత్త్వపరిశోధకులకు ఈ గీతా గ్రంధములు క్షీరసాగరమునుంచి పుట్టిన అమృతమే అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. గీతా త్రయము అను గ్రంధములోని భగవద్గీత ప్రామాణిక వ్యాఖ్యానములను పుణికి పుచ్చుకొని నూతన సొబగులతో వున్నది. గీతాతరంగిణిలో గురుగీత ఫలశృతి ఆశ్చర్యకరమైన విషయములను తెలిపింది. దీని పారాయణ అనేక సత్ఫలితాలు ఇవ్వటమేకాక సద్గురువు లభించేటట్లు చేస్తుంది. ఈ గ్రంధములో గర్భగీత గర్భావస్థలొ పరిణామములను నేటి విజ్ఞానాన్నితలపించేలా సాగింది. అవధూతగీత అలర్కగీతలు యోగాన్ని విస్తారంగా తెలిపాయి. గీతామణిమాల గ్రంధములో గణేశగీత యందుకూడ యోగము గురించి వున్నది. అందులో బ్రహ్మగీత, సూత గీత దశోపనిషత్తులను గుర్తుచేస్తూ వున్నవి. దేవీగీతలు, విదురనీతి చాలా ఆసక్తికరముగా వున్నాయి. ఋభుగీత గ్రంధములో ఋభుగీత అన్నపూర్ణ ఉపనిషత్తును అర్థం చేసుకోగలిగేటట్లు సులభంగా ఆసక్తికరంగా వుంది. సుబ్రహ్మణ్యుడి మాటలలో జ్ఞానము గురించి లోకరీతి-పోకడలు ఇప్పటి లోకానుభవాలతో సరిపోయి వుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. గీతారత్నావళి గ్రంధము మహాభారతము నుండి వెలికితీసిన రత్నాల మాల. ఈ జ్ఞానము అనేక ప్రశ్నలకి సమాధానమై లోకంలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజెప్పే అధ్యాత్మజ్ఞాన ఖని. ఆరవ గీతాగ్రంధము గీతాశ్రీలహరి july 2018లో ప్రచురించిరి. ఇందులో పురాతనమైన ఈశ్వరగీతతో పాటు అపురూపమైన యోగయాజ్ఞ్యవల్క్యగీత, యాజ్ఞ్యవల్క్యగీత, గోపికాగీతలు, భ్రమరగీత మొదలైన 14 గీతలు వున్నవి.
1. శ్రీకృష్ణ గీతా త్రయము : ఉద్ధవ గీత - భగవద్గీత - అనుగీత
2. ఋభుగీత : అన్నపూర్ణోపనిషత్ - ఋభుగీత
3. అధ్యాత్మ గీతా రత్నావళి : భృగు గీత - సనత్సుజాత గీత - ఆధ్యాత్మ జ్ఞాన గీత - మను గీత - మోక్ష గీత - మంకి గీత - బోధ్య గీత - అజగర గీత - పంచశిఖ గీత - శ్వేతకేతు గీత - వ్యాస గీత - షడ్జ గీత - పింగళ గీత - ఆత్మ కళ్యాణ గీత - శంపాక గీత - వృత్ర గీత
4. అధ్యాత్మ గీతా తరంగిణి : గురు గీత - శ్రీ దత్త గీత - అవధూత గీత - అలర్క గీత - శివగీత - బృహస్పతి గీత - రుద్ర గీత - శ్రీరామ గీత - శ్రీ రామ హృదయం - హంసగీత - హంస గుహ్య స్తోత్రం - అరిష్టనేమి గీత - యమ గీత - సనత్కుమార గీత - గర్భ గీత - వైరాగ్య గీత
5. అధ్యాత్మ గీతా మణిమాల: గణేశ గీత - విదుర గీత - అక్షర గీత - అష్టావక్ర గీత - సూతగీత - బ్రహ్మ గీత - శ్రీదేవీ గీత - శ్వేతాశ్వతరోపనిషత్
6. అధ్యాత్మ గీతాశ్రీలహరి
6. అధ్యాత్మ గీతాశ్రీలహరి
గమనిక: శుభ్రమైన వస్త్రధారణ, అంతఃకరణం పారాయణకు ముఖ్యమైన నియమాలు. విఘ్నాలు రాకుండా ముందుగా గణపతిని ప్రార్థించాలి. పారాయణా సమయంలో కోపానికి లోనవ్వకుండా వుండాలి. పిల్లలు, భర్త, భార్య, అభ్యాగతులు, తల్లిదండ్రుల రూపంలో కూడా విఘ్నాలు రావచ్చు. కాని వీరిపై ముఖ్యంగా పసిపిల్లలపై విసుగుపడకుండా ఆటంకాన్ని స్వీకరించాలి. తర్వాత రోజుకు ఆ ఆటంకంకూడా కలుగకుండా ముందుగా తగినజాగ్రత్త తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఇంటిలో పెద్దవారినుంచి పారాయణకు వ్యతిరేకంగా వచ్చే వత్తిడిని/ ఆటంకాలను వారు ఆశిస్తున్న బాధ్యతలను పూర్తిచేయటం ద్వారా లేక ఆదిశగా తగిన కృషి చేయటం ద్వారా తగ్గించుకోవచ్చు. తగినవిధంగా వారిని సంతోషపెడుతూ వారివల్ల అంతరాయం కలగని సమయాలు చూసుకుని చదవటం శ్రేయస్కరం, శుభకరం.
No comments:
Post a Comment